Wednesday, 20 November 2019

                                " ఢిల్లీ హెరిటేజ్ క్విజ్  కు ఎంపికైన కోదాడ విద్యార్థులు"
    భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ సంస్థ  ( INTACH - Indian National Trust For Art and Cultural Heritage ) ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో రాష్ట్ర స్థాయి " ఇంటాక్ వారసత్వ క్విజ్" పోటీలు జరిగాయి. పాఠశాల స్థాయి విద్యార్థులకు  భారతీయ చరిత్ర, కళలు‌, సాంస్కృతిక వారసత్వ అంశాలపై  అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఈ పోటీలను ఢిల్లీ కి చెందిన  ఇంటాక్ సంస్థ నిర్వహిస్తుంది. సాలార్జంగ్ మ్యూజియం లో జరిగిన ఈ పోటీలలో తెలంగాణ వ్యాప్తంగా 12 జిల్లాల విజేత జట్లు పాల్గొన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన  తేజ విద్యాలయ 10వ తరగతి విద్యార్థులు  బల్పునూరి పవన్ కుమార్ రెడ్డి మరియు దొంగరి విష్ణువర్ధన్ విజేతగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. విజేతగా నిలిచిన కోదాడ తేజ విద్యాలయ విద్యార్థులు డిశంబర్ 6న న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్థారు. వీరికి సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి, ఇంటాక్ తెలంగాణ కన్వీనర్ శ్రీ గోపాలకృష్ణ రిటైర్డ్ ఐ.ఏ. యస్ గారు  జ్ఞాపిక ఇచ్చి అభినందించారు.

Saturday, 16 November 2019

                                                      " భారత్ కో జానో " రాష్ట్ర విజేత తేజ."
    భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి " భారత్ కో జానో" ( భారత్ గురించి తెలుసుకోండి - know India) క్విజ్ పోటీలు జరిగాయి. భారతీయ గొప్పతనం గురించి  అవగాహన కల్పించాలని భారత వికాస పరిషత్ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా హైస్కూల్ విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహిస్తుంది. హైదరాబాద్ లో జరిగిన కోదాడ తేజ విద్యాలయ కు చెందిన 10వ తరగతి విద్యార్థులు  బల్పునూరి పవన్ కుమార్ రెడ్డి మరియు దొంగరి విష్ణువర్ధన్ విజేతగా నిలిచారు. వీరు నవంబర్24 న కర్నాటక రాష్ట్రం లోని బెల్గాం లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణ రాష్ట్రం తరుపున పాల్గోంటారు. వీరికి ప్రముఖ కవి రచయిత్రి శ్రీ మతి భవాని దేవి , భారత్ వికాస పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ హనుమంతరావు జ్ఞాపిక, ధృవీకరణ పత్రం అందించారు.



 
Teja Vidyalaya Stand 1st place @ CRYPTICS Quiz 2019 - Vijayawada


 

Wednesday, 6 November 2019

పుచ్చకాయ కథ

రచన: సాముల శశిధర్‌ రెడ్డి, 9వ తరగతి, తేజ విద్యాలయ, కోదాడ.
మార్పు చేర్పులు: కొత్తపల్లి

నారాయణ రెడ్డి- నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు- శశి, కిరణ్, వైష్ణవ
అది మంచి వేసవి కాలం. పిల్లలందరికీ సెలవలు. నారాయణ రెడ్డి ఆ రోజు ఉదయం బజారునుండి ఒక పుచ్చ కాయని తెచ్చాడు. పిల్లలంతా అది చూసి చాలా సంబరపడ్డారు.
నారాయణరెడ్డి దాన్ని ఐదు భాగాలు చేసాడు. మొత్తంగా ఫ్రిడ్జ్‌లో పెడుతూ "అందరం తలా ఒక ముక్కా తిందాం, సరేనా?! మధ్యాహ్నం అన్నం తిన్న తరువాతే తినాలి!" అన్నాడు. పిల్లలంతా 'సరే' అన్నారు.
కానీ కిరణ్ మటుకు ఆగలేకపోయాడు. వాడి మనసంతా "తిందాం తిందాం" అని తొందరపెట్టింది. అందరూ 'మధ్యాహ్నం' అని ఊరుకున్నారు కదా, కిరణ్ మాత్రం ఎవరికీ తెలవకుండా ఫ్రిజ్‌లోంచి ఒక ముక్క తీసుకొని తినేసాడు.
మధ్యాహ్నం అందరూ కలిసి భోజనం చేసాక, నారాయణ రెడ్డి "ఇప్పుడింక పుచ్చకాయ ప్రోగ్రాము" అంటూ వెళ్లి ఫ్రిజ్ తలుపు తెరచి చూసాడు. అందులో ఒక ముక్క లేదు!
నారాయణ రెడ్డి దాన్నే తెచ్చి ముందు పెడుతూ "మీ నలుగురిలో ఎవరు, వాళ్ల వాటా పుచ్చకాయ తినేసింది?" అని అడిగాడు. "నేను తినేసా" అని చెబుదామనుకున్నాడు కిరణ్. కానీ 'ఎందుకు తిన్నావు?' అని కోప్పడతారేమో?! -అని, నోరు మెదపలేదు. "సరే, పర్లేదులే, మనలో ఎవరికో చాలా ఆకలి వేసి ఉంటుంది. మిగిలిన దాన్నే మనం అందరం పంచుకుందాం" అని నవ్వి, ఆ మిగిలిన నాలుగింటినే అందరికీ సమానంగా పంచాడు నారాయణ రెడ్డి.
"ఇది తప్పు! అందరికీ కొంచెం కొంచెం తగ్గిపోతుంది!" గొణిగాడు పెద్దోడు.
"నేనేలే, తిన్నది! బాగా ఆకలివేసేసరికి, ఆగలేక తినేసాను. ఇప్పుడు ఇవన్నీ మీకే!" అన్నాడు కిరణ్, నోరు విప్పి. నారాయణ రెడ్డి వాడి భుజం తడుతూ "ఏమీ‌ పర్లేదు. ఈ సారి ఇంకా పెద్ద పుచ్చకాయ తెచ్చుకుందాం. ఏదైనా సరే, అందరం కడుపునిండా తినటం ముఖ్యం. ఎప్పుడు తిన్నా, ఉన్నదాన్నే సమానంగా పంచుకొని తిందాం!" అన్నాడు.
ఆశ్చర్యం, అటు తర్వాత ఎప్పుడూ ఇంట్లో పంపకాల సమస్య రాలేదు.

రైతు ప్రార్థన

"ప్రకృతిలో అంతులేని సంక్లిష్టత ఉంది. దాని రహస్యాలను తెలుసుకోవటం మంచిదే గాని, వాటిని మార్చేందుకు ప్రయత్నిస్తే మటుకు అన్ని సార్లూ మేలే జరుగుతుందని లేదు. ప్రకృతిలోనే కాదు; జీవితంలో కూడా, మనకు ఎదురయ్యే కష్టాలు మనల్ని మరొకరకంగా గట్టి పరుస్తాయి. కష్టాల్లోంచి బయట పడ్డ కొద్దీ మనకు ఆనందాన్ని అనుభవించటం కూడా తెలుస్తుంది. కష్టాలు ఎదుర్కొనని వాళ్లకు సుఖాన్ని ఎలా ఆస్వాదించాలో కూడా తెలియదు" అంటున్నారు ఈ టీచరు గారు. మీకు ఏమనిపిస్తున్నది?
రచన : కె.కృష్ణవేణి, ఉపాధ్యాయిని, తేజా విద్యలయం, కోదాడ, తెలంగాణ రాష్ట్రం.

బాగా వర్షం కురుస్తోంది.

కొందరు చిన్నపిల్లలు పడవలు చేయడంలో నిమగ్నమై పోయారు. కొందరు వర్షాన్ని చూస్తూ అందులో తడుస్తూ, కేరింతలు కొడుతూ ఉన్నారు. కానీ రైతు గుండెల్లో మాత్రం ఒకటే గుబులు- అకాల వర్షాల వల్ల పంట నాశనం అవుతుందని.

రైతు ఒక్కడే బాధపడుతూ దేవుడిని ఇలా ప్రార్థించాడు: "దేవుడా! పంట వేద్దామంటే నీళ్ళుండవు కానీ, నీటి అవసరం లేనప్పుడు, సరిగ్గా నేను కోత కోసే సమయానికి మాత్రం పెద్ద వర్షం కురిపిస్తావు, ఎందుకు? నీ ఈ పని వల్ల మాకు పంట నష్టం; మా శ్రమంతా వ్యర్థం. మాకు ఏ సమయంలో నీరు కావాలో, ఎప్పుడు గాలి అవసరమో మాకు తెలిసినంతగా నీకు తెలియదు స్వామీ. అందుకని దయచేసి నాకు ఈ వరం ఇయ్యి- 'పంటకు ఎప్పుడు అవసరమో చూసుకొని తగినంత గాలి, నీరు అన్నీ నేనే అందిస్తాను వాటికి!’. ఇట్లా మార్చు పద్ధతిని!" అని.
వెంటనే దేవుడు ప్రత్యక్షమై, "నువ్వు ఎట్లా అంటే అట్లాగే కానియ్యి. అంతా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుందిలే, బాధపడకు!" అని చెప్పి మాయమైపోయాడు.
రైతుకు చాలా సంతోషం వేసింది. "నారుమడి వేయాలంట- పొలాల్లో నీళ్ళు నిండాలి!" అన్నాడు. వెంటనే వర్షం వచ్చి నీళ్ళు చేరాయి. ఇక అటుపైన రైతు తన శక్తిని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. పొలాల్లో నీళ్ళ మట్టం కొంచెం తగ్గిందంటే చాలు, మేఘాల్ని పిలిచి వాన కురిపించుకున్నాడు.
విత్తనం ఆరేందుకు మంచి గాలి కావాలి. రైతు గాలిని ఆదేశించాడు- వెంటనే గాలి బాగా వీచింది. కంకులు కోయటం ఆరబెట్టటం అయ్యింది.
ఆ వెనక వాటిని తూర్పార బట్టేందుకు ప్రయత్నించాడు రైతు. చూస్తే వరి గింజలు అన్నీ‌ తాలువే! మొత్తం పొట్టే! గింజ లేదు! "ఇదెక్కడి ఘోరం, స్వామీ?! నీళ్ళు అవసరమయినప్పుడు నీళ్ళు, గాలి కావాలన్నప్పుడు గాలి- అన్నీ సమయానికి అందించాను కదా?! కానీ పంట పండలేదేల?" అంటూ దేవుడిని తలచుకొని వగచాడు రైతు.
దేవుడు మళ్లీ ప్రత్యక్షమై "చూడు నాయనా! చాలీ చాలని నీళ్ళున్న బురదలోకి వరి మొక్కను నాటగానే, తను ఎలాగైనా నెలకొనాలని ప్రయత్నించి, గట్టిగా నిలుస్తుంది అది. అటు తర్వాత నాటు పెరిగి పెద్దయ్యేటప్పుడు, గాలితోటి - వానతోటి పోరాడి, తన వేళ్ళను ధృడంగా మట్టిలోకి పంపించి, తన ఆవాసాన్ని స్థిరం చేసుకుంటుంది. నేను అడుగడుగునా పంపించే వర్షాన్ని, గాలిని, తట్టుకొని, అలా పెంచుకున్న తన శక్తినంతా గింజల రూపంలోకి మార్చి, కంకిని తయారు చేస్తుంది. అప్పుడు గదా, పంట నీ చేతికి వచ్చేది?!
కానీ ఎప్పుడు ఏమి అవసరమో నువ్వే నిర్ణయించుకొని, ఆ మొక్కలు ఏమీ శ్రమపడే అవసరం లేకుండా నువ్వే వాటికి అన్నీ తెచ్చి అందిస్తే, ఇక ఆ పంటకు దేనితోటీ పోరాటం లేదు; తనని తాను నిలుపుకునేందుకు ప్రయత్నించాల్సిన అవసరం లేదు; శక్తీ కూడా అవసరం లేదు; ఆ శక్తితో గింజలు తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందువల్ల వరి మొక్క పెరిగింది; కానీ అందులో గింజలు లేవు!" వివరించాడు దేవుడు.
"ఇంత లోతుగా నేను ఆలోచించలేదు స్వామీ! నన్ను క్షమించు. మళ్ళీ అన్ని బాధ్యతలూ తీసుకొని, నువ్వే, నీకు తోచినట్లు చెయ్యి" అని తలవంచి నమస్కరించాడు రైతు.

  Visit to Sriharikota ISRO