Thursday, 22 July 2021

 సంతోషం - సగం బలం
******************

           ఈరోజు ద హిందూ, ఈనాడు లాంటి అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న పత్రికల్లో ప్రధాన పేజీల్లో ( Main Edition) క్రింది వార్త రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక వార్త ఆ స్థాయిలో రావాలంటే చాలా ప్రాధాన్యత ఉండాలి. అటువంటి వార్తకు విలువ మరియు అర్హత ( credibility) ఉండితీరాలి.
      డబ్బు ఉంటే ఎంత పెద్ద అడ్వర్టైజ్ మెంట్ నైనా ఇవ్వొచ్చు. కాని ప్రధాన పేజీలోవార్తను మాత్రం పొందలేము. కోదాడ లాంటి చిన్న పట్టణానికి జాతీయ స్థాయిలో మళ్లీ మళ్లీ గుర్తింపు దక్కడం చాలా సంతోషంగా ఉంది.
          ఇది ఒక్కరోజులో సాధ్యమైనది కాదు. గ్రామీణ పాఠశాల చిన్నారులు జాతీయ స్థాయిలో అందునా విజ్ఞానానికి కొలబద్ద అయిన క్విజ్ పోటీలలో రాణించడం అసాధారణ విషయం. సుదీర్ఘమైన ప్రణాళికాబద్దమైన ఆలోచన, ఆచరణతోనే సాధ్యమైంది.
          కోదాడ పేరును జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్న మా చిన్నారులకి మీ అందరి ఆశీస్సులుండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సంతోషకరమైన వార్తలను నలుగురితో పంచుకుంటే వారి ఆశీస్సులే సగం బలం కాగలవని నమ్ముతున్నాను.



 

 వర్ష ఋతువు- మాదైన హరిత లోకం
***************************

             మా ప్రపంచాన్ని మరింత పచ్చగ మార్చే వర్ష ఋతువు అంటే నాకెంతో ఇష్టం. బాల్కనీలో కూర్చుంటే వినిపించే చిరు జల్లుల సవ్వడి, గది గవాక్షం గుండా కనిపించే  చెరువు మీద తెరపలుగా ముసురుకున్న నీలిమేఘాలు,  ఆ నీలి ఆకాశంలో దట్టంగా కమ్ముకున్న కారుమబ్బుల దృశ్యాలు, మా తోటలో దుక్కి దున్నిన ఎర్రనేలల నుంచి వచ్చే తొలకరి మట్టి వాసనలు, పచ్చని గరికతో పరుచున్న విశాల మైదానం సొబగులు, నీటి ప్రవాహంలో తేలియాడే బాస్కెట్ బాల్ ఆట స్థలం, వర్షంతో శుభ్రమై పోయి తళ తళ మెరుస్తూ హారిత శక్తినిచ్చే సౌరఫలకాలు ఆహ్లాదకరమైన ఉషోదయానికి స్వాగతం పలుకుతున్నాయి.
       యండమూరి వీరేంద్రనాథ్ ఓ నవలలో ఇలా అంటాడు “ ఎక్కడో కశ్మీర్ , ఊటి అందాలను చూడాలని కలలు కంటుంటాము. శుభోదయ వేళ మన ఇంటి గవాక్షం నుంచి చూస్తే కనిపించే గులాబీ మొగ్గ, రాత్రి వర్షంలో తడిసిన చెట్టు , వాటి ఆకుల మీద నుంచి జారిపోలేక జారిపోయే వాన చినుకుల సౌందర్యం ….. మనం సౌందర్యోపాసనతో చూడాలేగాని ఇవన్నీ నిత్యం ఉత్తేజాన్ని ఇస్తూనే ఉంటాయి.” అక్షరాల నిజమే కదా!
         తేజ విద్యాలయ, కోదాడ వచ్చి 9 సంవత్సరాలు పూర్తయింది. స్వగ్రామంలోని మా ఇంటి తర్వాత నేను అత్యధిక కాలం నివసించిన, ఇష్టపడిన ప్రదేశం ఇదే. మా కుటుంబం లో అందరికి విద్యాల














 



 

 

 30 ఏళ్ళ కృషి ఫలించిన వేళ
**********************

   “ ఈ ప్రపంచంలో రాణించటానికి అత్యుత్తమమైన ఆయుధం చదువు మాత్రమే. “
                      .........నెల్సన్ మండేలా
        పేదరికం, కుటుంబ నేపథ్యం , కులం, మతం, ప్రాంతం, భాషా తారతమ్యాలేవి చదువు కోవాలనే పట్టుదలను ఆపలేవు.
        సరిగ్గా 30 సంవత్సరాల క్రితం 1991 జూలై మాసంలో  ఇంటర్మీడియెట్ ఇన్స్టంట్ పరీక్షలో పాసై , డిగ్రీ కోసం ప్రైవేట్ ( E.V.R Memorial) కాలేజి , కోదాడలో చేరిన నాటి స్వప్నం. ఇంటర్ ఫెయిలై ఒక సంవత్సరం ఇంటి వద్దే ఉండి నాన్నతో కలిసి వ్యవసాయం చేసిన రోజుల్లో రగిలిన కసి అది. అథ్లెటిక్ పోటీలలో 100 మీటర్ల పరుగు ఎలాగో చదువుల పోటిలో క్విజ్ అలాగే అని నమ్మిన రోజులవి.
             అపారమైన జ్ఞాపకశక్తి, వేగవంతమైన మస్తిష్క మథనం, చురుకైన సమయ స్ఫూర్తి , సకల అంశాల మీద ప్రావీణ్యం ఇవన్నీ కలిస్తేనే క్విజ్. అందుకే క్విజ్ లో రాణించాలని నా మనసులో బలమైన బీజాలు పడిన రోజులవి. ప్రతిరోజు ఉదయం రెండు గంటలు దినపత్రికలు చదవటం, సాయంత్రం గ్రంథాలయం కు వెళ్లటం, రాత్రికి క్విజ్ కు సంబంధించిన పుస్తకాలు చదివి రాసుకోవడం నిత్యకృత్యాలుగా మారిపోయాయి. డిగ్రీ మూడు సంవత్సరాలు చాలా కష్టపడి చదివాను. జిల్లా స్థాయిలో ఎక్కడ క్విజ్ పోటీలు జరిగినా తప్పక వెళ్లి పాల్గొనేవాన్ని. మూడు సంవత్సరాల కష్టం ఊరికే పోలేదు. డిగ్రీ రాజనీతి శాస్త్రం ( Political Science) లో బంగారు పతకం రూపంలో లభించింది. 1994 ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ‘చరిత్ర ‘ లో సీటు దొరికింది.
      క్విజ్ అనేది కూడా ఒక పెద్ద వ్యసనం. కాకుంటే ఇది విజ్ఞానాన్ని సంపాదించేందుకు దోహదపడే ఒక మంచి వ్యసనం. హైదరాబాద్ ఎక్కడ క్విజ్ జరిగినా వెళ్లటం అలవాటైపోయింది. 1995 లో దూరదర్శన్ లో మన్ మోహన్ దత్ గారు రాష్ట్ర స్థాయి క్విజ్ తెలుగులో మెుదటిసారి నిర్వహించారు. నేను మితృడు నాగయ్య ( ప్రస్తుతం నల్గొండలో లైబ్రేరియన్ ) జట్టుగా క్విజ్ కై మెుదటసారి కెమెరా ముందు పాల్గొన్నాము.  మేమే గెలిచాము. 1995 లో అప్పుడప్పుడే ఈ.టి.వి మరియు జెమిని టి.వి ప్రారంభించిన రోజులు. రెండింటి లోనూ క్విజ్ నిర్వహించారు, రెండు ప్రథమ స్థానంలో గెలిచాము. అవన్నీ సుమధుర జ్ఞాపకాలు.
     నా డిగ్రీ అయిపోతూనే 1994 లో రాసిన పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూపు పరీక్ష ద్వారా మంచి ర్యాంక్ తో 1996 లో ఉద్యోగం సంపాదించాను. నాకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలనే బలమైన వాంఛ బడి వైపు నడిపించింది. అత్యుత్తమ దశను అధిరోహించిన  క్రీడాకారుడు సైతం తన పోటీ ఇక ముగిసిందని ఎన్నడు అనుకోడు. తన పరిజ్ఞానం తన తర్వాత తరానికి అందించాలనుకుంటాడు. నేను అదే పంథాలో వెళ్లాను.
        సరైన మార్గ నిర్దేశం చేస్తే గ్రామీణ ప్రాంత చిన్నారులు సైతం రాష్ట్ర, జాతీయ స్థాయి చదువుల పోటీలలో రాణించగలరని మెుదటి నుంచి నాకు ప్రగాఢమైన నమ్మకం. కనీసం పదవ తరగతి తర్వాత ఏమి చదవాలో కూడా తెలియని పరిస్థితి నాది. చదువు కోవాలనే చైతన్యం లేని గ్రామం నుంచి మెుదటి సారి డిగ్రీ , పీ.జి చేసి ఉద్యోగం సంపాదించాను. చదువుల పట్ల చైతన్యం లేని పిల్లలకు , తల్లితండ్రులకు పట్టుదల ఉంటే గ్రామీణ చిన్నారులు సైతం ఏదైనా సాధించగలరనే విశ్వాసం నెలకొల్పేందుకే నేను ఈ మార్గం ఎంచుకున్నాను.
             వ్యాపార కాంక్షతో కాకుండా , బలమైన స్ఫూర్తి తో  విద్యాలయను 2012 లో ప్రారంభించాము. కేవలం 300 మంది చిన్నారులతో ఎన్నో ఇబ్బందులను తట్టుకుని నడిస్తున్న బడి మాది. కనీస సౌకర్యాలతోనే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాము. 85% మంది పిల్లలు గ్రామీణ  వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న వాళ్లే. ఏదో ఒక రోజు మా కోదాడ చిన్నారులు  జాతీయ స్థాయి క్విజ్ లో గెలవాలనుకునే వాన్ని. 2012 లో విద్యాలయ ప్రారంభించినప్పటి నుంచి వివిధ రకాల క్విజ్ లలో జాతీయ స్థాయి (National) ఫైనల్స్ కై ఢిల్లీకి సుమారు ఓ 30 సార్లు వెళ్లమంటే నా చిన్నారుల ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. పది సార్లకు పైగా జాతీయ విజేతలుగాను నిలిచాము.
        కరోనా సంక్లిష్ట పరిస్థితులలో సైతం డిజిటల్ మాధ్యమం ద్వారా నిర్వహించిన “India Quiz Championship 2021” తేజ చిన్నారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.  దేశ వ్యాపితంగా 20,000 పాఠశాలలతో పోటి పడి “ అత్యుత్తమ క్విజింగ్ పాఠశాల “ గా నిలిచింది. మెట్రో , కాస్మో పాలిటన్ నగరాలలోని పెద్ద పెద్ద కార్పోరేట్ మరియు ఇంటర్నేషనల్ బడులను అధిగమించి ఒక చారిత్రక విజయాన్ని అందుకుంది. బడా బడా పట్టణాల్లోని పాఠశాలలకు ధీటుగా నిలవటం వెనుక నా 30 ఏళ్ల స్వప్నం దాగి ఉందని నమ్ముతున్నాను.
         మన స్వప్నం ఫలించిన క్షణాలు ఉద్విగ్నంగా ఉంటాయి. ఆ స్వప్నం తాలుకు శ్రమ ఆ నిమిషాన అందమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ప్రతి క్విజ్ జర్నీ లో ఉండే శ్రమ , ప్రణాళిక , పిల్లలతో మమైక్యమయ్యే విధానం అన్నీ కూడా భవిష్యత్ లో నెమరవేసుకునే అందమైన జ్ఞాపక పుటలుగా మారిపోతుంటాయి. ఈ ప్రయాణంలో నన్ను నడిపించిన గురువర్యులకు , సహాకరించిన శ్రేయోభిలాషులకు సర్వదా కృతజ్ఞతలు. ఈ విజయాన్ని పట్టుదలతో అభ్యసించే ప్రతి చిన్నారికి ముఖ్యంగా విద్యా చైతన్యం లేని కుటుంబాలనుంచి వచ్చే పిల్లలకు అంకితం చేస్తున్నాము.
        నా ఈ జర్నీ లో పిల్లలకు నేర్పే క్రమం లోనే  పిల్లలతో కలిసి దేశమంతట తిరిగాము, ఆఖరికి సింగపూర్ కూడా వెళ్లాను. ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో భారత రక్షణ శాఖా మాత్యుల ఆతిధ్యం స్వీకరించాము, ప్రజారంజకమైన టి.వి షో” మీలో ఎవరు కోటీశ్వరుడు” లో చివరి ప్రశ్నను సైతం ఎదుర్కొన్నాను. క్విజ్ నా జీవితాన్ని మాత్రమే కాదు.... నాతో జర్నీ చేసిన ఎందరో చిన్నారుల జీవితాలను మార్చివేసింది. ఎన్నో అందమైన జ్ఞాపకాలను పది కాలాలపాటు వారి మదిలో పదిలంగా నిలిపేలా చేసింది. ఇదంతా క్విజ్ మహిమ అని నేను సగర్వంగా చెప్పుకుంటాను.
           
నిన్న అనేది ఒక జ్ఞాపకం - అది మధురంగా ఉండిపోవాలి.       
నేడు అనేది ఒక ఛాలెంజ్ - నలుగురికి మార్గనిర్దేశంగా చేయాలి.
రేపు అనేది ఒక స్వప్నం -  ఆశయాల ఆశలకు రెక్కలు తొడగాలి.

     జీవితం అంటే నిస్సారమైనది కాదు., వేయి కరోనాలు వచ్చినా బలమైన మన స్వప్నాలను ఏవి ఆపలేవు. “ నిరంతర చైతన్య శీలమైన మనిషి మస్తిష్క గమనమే ఈ విశ్వపు అవధులను దాటేలా చేసింది..” అన్న రాహుల్ సాంకృత్యన్  మాటలు ఎప్పుడూ నా మదిలో మార్మోగుతూనే ఉంటాయి.

 

 

 

 Finals of Quizzon 21':The National School Quiz will be available in YouTube link.

Schools in the Finals:
1) Teja Vidyalaya, Telengana
2) SAI International School, Bhubaneswar
3) Loyola School, Bhubaneswar
4) Mother's Public School, Bhubaneswar
5) DPS North Bangalore
6) KIIT International School, Bhubaneswar

 గ్రామీణ ఆణిముత్యాలకు అంకితం!
*******************
*******

             ప్రోత్సహిస్తే గ్రామీణ విద్యార్దులు సైతం జాతీయ స్థాయిలో మెట్రోపాలిటన్ నగరాల పిల్లలతో పోటీపడి రాణిస్తారని నమ్మి స్థాపించినదే ‘తేజ విద్యాలయ’ కోదాడ. ఎన్నో ఒడుదుడుకులెదురైనా సాధారణ ఫీజులతోనే అత్యున్నతమైన విద్య ను అందిస్తున్నాం. కోదాడ లాంటి చిన్న పట్టణం నుంచి మా విద్యార్దులు తెలంగాణకు ప్రతినిధులుగా పాల్గొనడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. అన్ని రంగాలలో జ్ఞానానికి కొలబద్ద ‘క్విజ్’ . జాతీయ స్థాయి క్విజ్ ద్వారా మళ్లీ మేము గ్రామీణ భారత జ్ఞానాన్ని మరోసారి నిరూపించాం. దీనిని సరైన, వసతి సౌకర్యాలు లేక పోయినా కసితో చదివే లక్షల గ్రామీణ ఆణిముత్యాలకు స్ఫూర్తి కోసం అంకితం ఇస్తున్నాము.

 నిజమైన బడి:-
****************

        ప్రకృతి ఒడిలో పిల్లలు నేర్చుకునే విధానాన్ని పాఠశాల విద్యలో భాగం చేయడం ద్వారా వారు ప్రకృతితో మమేకమయ్యే అవకాశం బాగా ఉంటుంది. అర్జున్  తన మాటలలో ‘బడిలో సేద్యం ‘ గురించి చక్కగా వివరించాడు. కోదాడ తేజ విద్యాలయంలో కూడా మెుదటి నుంచి ‘మా తోట’ పేరున మేము పిల్లలకు పర్యావరణ విద్యలో దీనిని భాగం చేసాము. చదవంటే కేవలం నాలుగు గోడల మద్య నేర్పే గణితము ( Maths) & శాస్త్ర విజ్ఞానం ( Science ) మాత్రమే కాదు. ఈ విశాల ప్రపంచాన్ని అవగతం చేసుకోగల అన్ని అంశాలని ప్రతి ఒక్కరు గమనించాలి. భావ వ్యక్తీకరణ మరియు సృజనకోసం భాషా శాస్త్రాలు , సామాజిక చైతన్యం కోసం సామాజిక శాస్త్రాలు, పర్యావరణ అవగాహన కోసం సేద్యపు పనులు, వారిలో అంతర్లీనంగా దాగిన అభిరుచులు వెలికి తీసేందుకు కళలు ( సంగితం,నృత్యం, చిత్రలేఖనం, క్రాప్టు మెుదలైనవి) , వ్యాయామం కోసం ఆటలు, రక్షణాత్మక మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరి పాఠశాల విద్యలో ఉండాలి. అదే నిజమైన బడి. బాల్యాన్ని పిల్లలకు అందించే స్వర్గపు లోగిలి.

Wednesday, 21 July 2021

 క్విజ్ జాతీయ విజేత - తేజ విద్యాలయ
******************************

                 ఇండియాటుడే వార్తా ఛానల్ గ్రూపు ( అమృత్ విశ్వవిద్యాలయం , కోయంబత్తూర్ వారి సౌజన్యంతో) దేశ వ్యాప్తంగా కళలు, వాణిజ్యం, శాస్త్రవిజ్ఞానం మరియు జనరల్ నాలెడ్జి ( Arts, Commerce, Science & General Knowledge) అంశాల మీద క్విజ్ నిర్వహించారు.  
           ప్రతి పాఠశాల నుంచి విద్యార్దులు ఎందరైనా పాల్గొనవచ్చు. జాతీయ స్థాయి పోటీ కావడం వలన వేల పాఠశాలల నుంచి లక్షల మంది విద్యార్దులు పాల్గొన్నారు. Prelims Zonal Quarter Finals, Zonal Semi Finals, Zonal Finals, National Semi Finals గా ఐదు దశల నిర్వహణ తర్వాత మెుత్తం (8) జట్లను National Finals కు ఎంపిక చేయటం జరిగింది.
           July 16, 2021 న ఇండియా టుడే గ్రూప్ ఛైర్మన్ ఐన ప్రసిద్ద జర్నలిస్టు రాజ్ దీప్  సర్దే శాయ్ గారు ప్రత్యేకంగా తుది (ఫైనల్) పోటీలను అత్యద్భుతంగా నిర్వహించారు. 60 నిమిషాల పాటు జరిగిన పోటీలో జాతీయ, అంతర్జాతీయ అంశాలనేకం అడగటం జరిగింది. ప్రతి ప్రశ్నకు 60 సకన్లలో లోపే సమాధానం చెప్పాలి. తుది ఫలితాలను ఈరోజు ప్రకటించటం జరిగింది.
         తేజ విద్యాలయ విద్యార్దులు వేణుగోపాల్, నదీమ్, అభిరాం, సమద్ లు అత్యున్నత ప్రతిభ కనబరిచి తుది (ఫైనల్స్ ) పోటీలో జాతీయ విజేతగా నిలిచారు. క్విజ్ మాస్టర్ రాజ్దీప్ సర్దేశాయ్ గారు విద్యార్దులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్దులు ఒక్కోక్కరు 50,000 విలువైన రోబోటిక్ కిట్లు బహుమతిగా గెలుపొందారు. 



 జాతీయ వ్యాస రచన పోటీలో తేజ విద్యార్థి ప్రతిభ
************************************

        సూర్యాపేట జిల్లా , కోదాడ తేజ విద్యాలయ లో 10 తరగతి చదువుకున్న కుందూరు. హరిణి జాతీయ స్థాయి వ్యాసరచన పోటీలో బహుమతి గెలుచుకుంది.
              పెట్రోలియం పరిరక్షణ పరిశోధక సంస్థ (Petroleum Conservation and Research association)వారు జాతీయ స్థాయిలో "మెరుగైన పర్యావరణం కోసం ఇంధన వనరుల ఆదా" ( Save Energy for better Environment) అనే అంశం మీద వ్యాసరచన పోటీలు 2020- 21 విద్యాసంవత్సరంలో నిర్వహించారు.
       లక్షల మంది పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో మొదటి '50' మంది లో కె. హరిణి నిలిచి జాతీయ స్థాయికి బహుమతి గెలిచుకుంది.


 

 నలుగురు విద్యార్దులు- నాలుగు నేపథ్యాలు
**********************************

            తేజ విద్యాలయ విద్యార్దులు అత్యున్నత ప్రతిభ కనబరిచి తుది (ఫైనల్స్ ) పోటీలో జాతీయ విజేతగా నిలిచారు. వీరి నలుగురు - నాలుగు విభిన్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు.
             తిప్పన అభిరామి రెడ్డి (9)
             షేక్ అవాయిస్ నదీమ్ (10),
             షేక్ అబ్దుస్ సమద్ (9) ,
             చేపూరి వేణుగోపాల్ (10) వ తరగతులు చదువుతున్నారు.
 
                  అందరివి మద్యతరగతి కుటుంబాలే. అభిరామి రెడ్డి తండ్రి రవీందర్ రెడ్డి మేళ్లచెరువు లోని మైహోం సిమెంటు పరిశ్రమలో చిన్న ఉద్యోగి మరియు వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం, నదీమ్ తండ్రి   అల్లాబక్ష్ గారు వృత్తి రీత్యా దర్జీ (tailoring). సమద్ తండ్రి  హామీద్ గారికి గడియారాలు బాగుచేసే దుకాణం ( Watch Repair shop) ఉంటుండే కరోనా పరిస్థితుల్లో దుకాణం నడవక బంధువుల బట్టల దుకాణం లో పనిచేస్తున్నాడు. అమ్మ నస్రీన్ మా పాఠశాలలో హిందీ అధ్యాపకురాలు. వేణుగోపాల్ వాళ్ల నాన్న హనుమంతరావు గారు హుజూర్ నగర్ మండలం అమరవరం గ్రామంలో చిన్న కిరాణం దుకాణం మరియు ధాన్యం వ్యాపారం నేపథ్యం.
        వారి నేపథ్యం ఎలాంటిదైనా అంతర్లీనంగా సాధించాలనే కసి పిల్లలలో బాగుంది. ఈ క్విజ్ కోసం వీరు ప్రత్యేకంగా తయారైంది లేదు. ప్రతి రోజు పాఠశాల పంపించే వార్తాపత్రిక చదవడం , విశ్లేషించడం చేసేవారు. తేజ విద్యాలయ గ్రంథాలయం లోని విజ్ఞాన పుస్తకాలను, కంప్యూటర్ లాబ్ ను గత 5 సంవత్సరాలుగా ఉపయోగించుకుంటున్నారు. పిల్లల సుదీర్ఘ మైన కృషి వలన జ్ఞానంతో పాటు  ఇలాంటి విజయాలను స్వంతం చేసుకుంటున్నారు. ఇదే వారి విజయ రహస్యం.
               గ్రామీణ పాఠశాలలో చదివే విద్యార్దులలో ప్రతిభ మెండుగా ఉంటుంది. చదువులలో, ఆటలలో , ఆలోచనలలో విభిన్నంగా ఆలోచిస్తారు. కుల, మత, ప్రాంతీయ భేధం లేని సామరస్యం పాఠశాలల లోనే వర్ధిల్లాలి. గత 70 సంవత్సరాల స్వాతంత్ర్య చరిత్రలో పాఠశాలలు కుల, మత విభజన లేకుండా నడిచాయి. ఇక ముందు కూడా ఇలాగే నడవాలని కోరుకుందాం. ఈ విధానం నిష్కల్మషమైన చిన్నారుల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తుంది. అది విశ్వమానవీయతకు బాటలు వేస్తుంది.
      తేజ విద్యాలయ విద్యార్దులు 2019 లో ఇండియాటుడే గ్రూపు సంస్థలు నిర్వహించిన “News Wiz” లో సైతం National Finals కు చేరి న్యూఢిల్లీ లోని వారి స్టూడియోలో పాల్గొన్న విషయాన్ని సైతం క్విజ్ మాస్టర్ రాజ్దీప్ సర్దేశాయ్ గారు గుర్తుచేసి విద్యార్దులను మరియు వారికి శిక్షణ ఇచ్చిన ధనుష్ ను ప్రత్యేకంగా అభినందించారు.


 

Teja Vidyalaya Nurtures Young Gardeners Through “Maa Thota” Program

In a meaningful step towards promoting environmental awareness and experiential learning, Teja Vidyalaya successfully organized the “Maa Tho...